యువరక్తంతో గెలుపు తథ్యం: వెంకయ్య
న్యూఢిల్లీ: యువకులను ఆకర్షించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని, యువరక్తంతో పార్టీకి భారీ గెలుపు తథ్యమని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 300కి పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణభారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై తమ పార్టీ దృష్టిసారించిందని, ఈ ప్రాంతాల్లో రానున్న కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున యువకులను పార్టీలో చేర్చుకోనున్నామని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ సైద్దాంతిక వైఖరి కొత్త తరానికి తెలియచేసేలా తాను బహుముఖ సరికొత్త వ్యూహాన్ని రచించినట్లు ఆయన తెలిపారు.
కొత్తగా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున్న చేపట్టనున్నామన్నారు. పార్టీ కార్యకర్తల అవసరాలను తీర్చేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు న్యూఢిల్లీలోని పార్టీకార్యాలయంలో సహయోగ్, సమవాద్, సమర్పణ్ అనే మూడు సరికొత్త పద్దతులను అవలంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.