మాపై ఒత్తిడి లేదు:గంగూలీ
సెంచురియన్: పాకిస్థాన్ తో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అదనపు ఒత్తిడి లేదని భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కేవలం మరొక మ్యాచ్గా మాత్రమే తాము భావిస్తున్నట్లు ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపాడు.
ఆస్ట్రేలియ, ఇంగ్లాండ్ తదితర జట్టులతో ఆడిన మ్యాచ్ ల మాదిరిగానే పాక్ తో కూడా ఒక మ్యాచ్ గానే భావిస్తున్నాం తప్ప ప్రత్యేకంగా ఒత్తిడిలో అయితే లేమని ఆయన అన్నారు.
మా విధానంలో మార్పేమీ లేదు. ఒక్కోసారి పాక్ ఎదురుదాడికి దిగుతుంది. మరోసారి జావగారిపోతుంది. అయితే, మేం సిద్దంగా ఉన్నాం. మేం తప్పు చేయదల్చుకోలేదు. అదే మా విధానం అని గంగూలీ తెలిపాడు. మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎటువంటి రొచ్చగొట్టే సందేశాలు వ్యక్తమవకుండా జాగ్రత్తపడదల్చుకున్నామన్నారు.
అది చాలా కీలకమని పేర్కొన్నారు. భావోద్వేగాలను ప్రదర్శించదల్చుకోలేదన్నారు. ఇప్పటికే భారత్ కు సూపర్ సిక్స్ స్థానం ఖాయమైంది. 16 పాయింట్లు, మెరుగైన రన్ రేటు ఉన్న భారత్ పాక్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోయినప్పిటీకీ పెద్ద ప్రమాదమేమీ లేదు. ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే తప్ప భారత్ సూపర్ సిక్స్ స్థానానికి ఢోకా లేదు.
ప్రపంచకప్ లో పాక్ పై మా రికార్డు (3-0) బాగానే ఉంది. కాబట్టి పాక్ పై గెలుస్తామన్న నమ్మకం అయితే ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.