కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి?: సోనియా
న్యూఢిల్లీ: గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పిస్తామని బిజెపి తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఈ అంశాన్ని సోమవారం కాంగ్రెస్ పక్షనేత సోనియాగాంధీ లోక్ సభలో లేవనెత్తుతూ ఆసక్తికరమైన చర్చను ప్రారంభించారు. మూడేళ్ళ క్రితం కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ లెక్కన ఇప్పటికీ దేశంలో మూడు కోట్ల మందికి ఉద్యోగాలు దొరకాలి. మరి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆ మాట మర్చినట్లున్నారు వాజ్ పేయి గారూఅని సోనియా బిజెపి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
గంటసేపు చర్చలో పాల్గొన్న సోనియాగాంధీ మ్యానిఫెస్టోలోని అంశాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు తదితర అంశాలపై ఘాటుగా ప్రసంగించారు. దీనిపై వాజ్ పేయి కూడా తనదైన రీతిలో స్పందించారు. వాజ్ పేయి, సోనియాల మధ్య సంవాదం అందర్నీ ఆకట్టుకొంది.
ఉద్యోగాల కల్పన మాత్రం చేస్తామన్నాం. కానీ ప్రత్యక్ష ఉద్యోగాల గురించి చెప్పలేదు. వివిధ పథకాల ద్వారా ఈ రెండేళ్ళల్లో కోటిన్నర ఉద్యోగాల కల్పన చేశారు. ఈ ఏడాది మరో 78 లక్షల ఉద్యోగాలు అందించనున్నామని ప్రధాని వివరించారు.
మరోవైపు, హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి హిందూత్వ ఓటమని సోనియాగాంధీ వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ ప్రతినిధి వి.కె.మల్హోత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు గర్హనీయమన్నారు.