అసెంబ్లీలో ప్రతిరోజూ తెలంగానం!
హైదరాబాద్: ఈ సారి అసెంబ్లీ లో ప్రతిరోజూ తెలంగాణ అంశం ఏదో ఒక విధంగా ప్రస్తావనకు వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, టీడీపీ నేతలు ప్రతిరోజు ప్రత్యేక తెలంగాణపై వాదోపవాదాలు చేసుకుంటున్నారు. లేవనెత్తిన అంశానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖరరావు చర్చను తెలంగాణవైపు తీసుకువెళుతున్నారు.
ఆవు కథ మాదిరిగా ఆయన ప్రతి అంశానికి తెలంగానాన్ని ఆలాపిస్తుండగా, టీడీపీ నేతలూ అంతే విధంగా భావావేశంతో మాట్లాడుతున్నారు. సోమవారం నాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై జరిగిన చర్చ ఆసాంతం పక్కదోవపట్టింది. ఈ సారి బడ్జెట్ లో నీటిపారుదల రంగంలో తెలంగాణకు తక్కువగా నిధులు కేటాయించరని చంద్రశేఖరరావు ఆరోపించారు.
కానీ నిజానికి ఈ సారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు అధికంగా నిధులు కేటాయించారు. ఈ విషయాన్ని గణాంకాలతో సహా చెప్పాల్సిన ప్రభుత్వం కెసిఆర్ పద్దతిలోనే పాత పాటే అందుకొంది.
టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేశంగా మాట్లాడుతూ..మంత్రిగా ఉన్నప్పుడు..టీడపీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావ్? అంటూ ఆయన పాత పాట అందుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకొని చర్చను పక్కదోవపట్టించవద్దని పదేపదే కోరాల్సివచ్చింది.