నా పదవికి ఢోకాలేదు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన పదవికి ఎటువంటి ఢోకా లేదని రాష్ట్ర పీసీసీ అధినేత ఎం.సత్యనారయణరావు ధీమా వ్యక్తంచేశారు. పదవి నుంచి తనను తొలగించనున్నారని కొద్ది రోజులుగా వస్తోన్న వార్తలను ఆయన వైల్డ్ ఇమాజినేషన్ గా అభివర్ణించారు. న్యూఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిసొచ్చిన ఎమ్మెస్సార్ ను ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.
ఈ సందర్భంగా ఆ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ..పార్టీలోని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నంతా మాత్రానా తన పదవి ఊడుతుందనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గత విభేదాలున్నమాట వాస్తవమేనని అంగీకరించారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోన్న కొంతమంది ఈ రకంగా ప్రచారం చేస్తోన్న అధిష్టానం తనను తొలగించేందుకు కారణమేదీ లేదన్నారు. ఏదో ఒక కారణం లేకుండా తొలగించరు కదా అని ఆయన తిరిగి ప్రశ్నించారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన విజయం నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ తనను తొలగించినా బాధలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పదవిపై ఆశలేనప్పుడు అది పోతుందనే బాధ ఉంటుందా అని ప్రశ్నించారు.