బలహీనవర్గాల ఇళ్ళపై దుమారం
హైదరాబాద్: బలహీనవర్గాల గృహాల నిర్మాణంపై మంగళవారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్, సిపిఎం సభ్యులు వాకౌట్ చేశారు.
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య దాదాపు అరగంట పాటు వాగ్వివాదం చెలరేగింది. బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేక పోయారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
యేటా ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని,ఈ లెక్కన గత మూడున్నర యేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాల్సి వుండదని, నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరగలేదని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
బలహీనవర్గాల గృహ నిర్మాణం పథకం అమలు మెరుగుగానే ఉన్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కరవు పరిస్థితుల వల్ల కాస్తా వెనుకపడిన మాట వాస్తవమేనని, అయితే లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన అన్నారు. అనుకున్న దాని కన్నా ఎక్కువ ఇళ్లే కట్టామని ఆయన చెప్పారు.