ఫైనల్ కు రాజకీయ గ్లామర్!
న్యూఢిల్లీ: భారత్ ఫైనల్ కు వెళ్ళడం దాదాపు ఖాయమని రుజువు అవుతుండడంతో, ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు రాజకీయనేతలు ఉబలాటపడుతున్నారు. 150 మంది రాజకీయ ప్రముఖులు, బిజినెస్ మెన్, గ్లామర్ తారలతో కూడిన బోయింగ్ 727 విమానం ఒకటి దక్షిణాఫ్రికాకు బయలుదేరనుంది. ప్రస్తుతానికి 23 మంది ఎంపీల ప్రయాణం ఖరారు అయింది. కెన్యాతో జరిగే సెమీఫైనల్ కు ముందు రోజే ఈ విమానం న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతుంది.
లోక్ సభ స్పీకర్ మనోహర్ జోషి, రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అధ్యక్షతన బయలుదేరే ఈ రాజకీయ, గ్లామర్ బృందం ఫైనల్ వరకు ఉంటుంది. మా బృందంలో 23 మంది బయలుదేరుతారు. మేమంతా ఒక ప్రత్యేకమైన టీషర్ట్ లు ధరించి, భారతజట్టుకు మద్దతు పలుకుతూ..ఉత్సాహాన్ని రేపుతామని మాల్యా తెలిపారు.
ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం నుంచి తెలుగు హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరోలు సునీల్ షెట్టి, జాన్ అబ్రహాం తదితరులు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఈ వారం బయలుదేరే మరికొంత మంది ప్రముఖుల్లో ఒకప్పటి సుందరి నటీమణులు బిపాసాబసు, ప్రీతిజింటా, నఫీసా అలీ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, డిజైనర్ రితూ బెరి తదితరులు ఉన్నారు.