సీఎంకు వైఎస్ ప్రత్యేకలేఖ
హైదరాబాద్: సీఎల్పీ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తనపై అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండడంతో వై.ఎస్ లేఖాస్త్రాన్ని సంధించారు. సరస్వతీ ప్రాజెక్ట్, 1990లో మతకల్లోహాల్లో తన ప్రమేయం, ఆస్తులపై ప్రభుత్వం ఓ కమిషన్ వేసి జరిపించాలని ప్రభుత్వాన్నే కోరుతూ ఆయన ఒక పెద్ద లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు.
గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వైఎస్ స్వయంగా వెళ్ళి ఈ లేఖను అందచేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు పవర్ ప్రాజెక్ట్ లలో తన కుమారుడు పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలను లేవనెత్తి వై.ఎస్ ను ఇరుకున పెట్టారు.
దాంతో పాటు పీవీ నరసింహరావుపై చెప్పుల దండ వేయడం, 1990లో ముఖ్యమంత్రిని గద్దెదించేందుకు జరిగిన కుట్ర వంటి అంశాల్లో వై.ఎస్ పాత్రపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. వీటిని అన్నింటిని వైఎస్ సవివరంగా వివరిస్తూ..తన పాత్ర ఏమీ లేదని...ఒక వేళ ఉందని భావిస్తే ప్రభుత్వం విచారణ జరిపించాలని వైఎస్ రివర్స్ లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ లేఖలో రాశారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...వై.ఎస్ లేఖలో కొత్తదనమేమీ లేదన్నారు. దీనిపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఆయన అసెంబ్లీలో రోజూ ఏదీ చెపుతున్నారో అదే ఇందులో ఉందని పేర్కొన్నారు.