కరువు దారుణం, సాయం పెంచండి
న్యూఢిల్లీ: గత నలభై ఏళ్లల్లో ఎప్పుడూ లేనంత తీవ్రమైన కరువు ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి నివేదించారు. కేంద్రం అందచేస్తోన్న సాయం మాత్రం స్వల్పంగా ఉందని, నిధుల కేటాయింపులను పెంచాలని ముఖ్యమంత్రి ప్రధాని వాజ్ పేయిని కోరారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి విచ్చేసిన బాబు ప్రధాని వాజ్ పేయి, ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ, ఆహారశాఖమంత్రి శరద్ యాదవ్ లతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితిని వివరించారు. చెరువులు, జలాశయాలు ఎండిపోయాయి. రైతులు పశుగ్రాశం లేక ఇబ్బంది పడుతున్నారు. మేం సహాయక చర్యలు చేపట్టినా, నిధులు సరిపోవడం లేదని ఆయన ప్రధానికి తెలిపినట్లు తెలిసింది. శనివారం కేంద్రప్రభుత్వం కరువుపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
ఆ సమావేశం అనంతరమే ఏ ప్రకటైనా వెలువడుతుందని ముఖ్యమంత్రి విలేకరులతో చెప్పారు. మా వాదన విన్పించాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే భావిస్తున్నామన్నారు.