భారత్ ఆటతీరుపై కుంబ్లే మౌనం!
బెంగుళూరు: ప్రపంచకప్ టోర్నమెంట్ ఆసాంతం మౌనంగా ఉన్న కుంబ్లే - మ్యాచ్ అనంతరం భారత్ ఆటతీరుపై మౌనమే ప్రదర్శించాడు. టోర్నమెంట్ లో ఒకే ఒక ఆటలో మాత్రం ఆడిన ఈ సుప్రసిద్ద లెగ్ స్పిన్నర్ టీం మేనేజ్ మెంట్ తనపై చూపిన తీరుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాడు. కుంబ్లే స్థానంలో దినేష్ మోంగియాను ఆడించిన గంగూలీకి ఫైనల్లో కుంబ్లే లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండగా, కుంబ్లే మాత్రం ప్రపంచకప్ కు సంబంధించి ఏ అంశం గురించి పెదవి విప్పడం లేదు.
దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన కుంబ్లే పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ....కాంట్రాక్టులో ఉన్నందును నేను కామెంట్ చేయడం సబబు కాదు. ఏదీ మాట్లాడాలన్నా కెప్టెన్ గంగూలీయే మాట్లాడాలని పేర్కొన్నాడు. జట్టులో సీనియర్ సభ్యుడైన కుంబ్లేకు ఇచ్చిన ట్రీట్ మెంట్ పట్ల పలువురు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.
ప్రముఖ పాకిస్థాన్ బౌలర్ వసీం అక్రమ్ ఇటీవల తాను రాసిన కాలమ్ లో ఫైనల్లో కుంబ్లేలాంటి అనుభవజ్ఞుడు, కూల్ గా వికెట్లు తీసే వ్యక్తి మద్దతు లేని లోటు గంగూలీకి తెలిసొచ్చందని అభిప్రాయపడ్డాడు. తన భవిష్యత్ ప్రణాళిక గురించి ఏమీ అనుకోలేదని కుంబ్లే తెలిపాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ లో పాల్గొనే దానిపై కూడా ఏమీ ఆలోచించుకోలేదన్నాడు.