వైఎస్, దేవేందర్ గౌడ్ సంవాదం
హైదరాబాద్: బుధవారం స్థానికేతర ఉద్యోగులపై జరిగిన చర్చ - సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, హోంమంత్రి దేవేందర్ గౌడ్ ల మధ్య వాగ్యుద్దానికి దారితీసింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు తొలుత ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, వై.ఎస్ తెలంగాణపై ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగినట్లైతే..తన తలను తీసి ఇస్తానని ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. కానీ మాకు ఎవరీ తలలు వద్దు...అని ప్రారంభించడంతో స్పీకర్ ప్రతిభాభారతి అడ్డుతగిలారు.
హోంమంత్రి దేవేందర్ గౌడ్ వై.ఎస్. వ్యాఖ్యలపై అభ్యంతరం చెపుతూ...కాంగ్రెస్ కు ఒక విధానం అంటూ లేదు. రాయలసీమ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, కోస్తా కాంగ్రెస్..అంటూ రకరకాలున్నాయి. వారికే ఏ ప్రాంతం మీద సరైన అవగహన లేనప్పుడు ఎలా మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే తెలంగాణ వెనుబడి పోయింది. వారు తెలంగాణపై మాట్లాడడం విడ్డూరం.అంటూ దేవందర్ ఘాటుగా విమర్శించారు. దీనికి వై.ఎస్. అడ్డుతగులుతూ..ఈ ఇరవై ఏళ్ళ కాలంలో మీరే(టీడీపీ) అధికారంలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పాలన అంటారేమిటీ అని మండిపడ్డారు. దీంతో దేవందర్ గౌడ్ స్వచ్చందంగా తెలంగాణపై ప్రత్యేక చర్చకు డిమాండ్ చేశారు. ఎవరి హయాంలో ఏమి జరిగింది. అన్ని రకాల అభివృద్దిపై ప్రత్యేక చర్చకు మేం సిద్దంగా ఉన్నాం. మాకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన స్పీకర్ ను కోరారు. వైఎస్ కూడా ఇందుకు సిద్దమన్నారు.