సభా సంఘాలు ఏమీ చేస్తాయి?: బాబు
హైదరాబాద్: గురువారం అసెంబ్లీలో ఐఎఎస్ అధికారుల వ్యవహరం చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య పెద్ద దుమారాన్నే రేపింది. మఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్కు దర్పణంలాంటి ఈ వ్యాఖ్యపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి మండిపడ్డారు. సీనియర్ ఐఎఎస్ అధికారి అర్జునరావు బదలాయింపు వ్యవహారంపై సభాసంఘాన్ని నియమించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
దీనిపై ముఖ్యమంత్రి సమాధానిమిస్తూ...దీనికి హౌస్ కమిటీలు ఎందుకు అధ్యక్షా! అయినా, హౌస్ కమిటీల వల్ల ఏమి అవుతుంది. అందులో కూడా మా వాళ్లే (టీడీపీ ఎమ్మేల్యేలు) ఉంటారు. అని అనడంతో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రికి సభాసంఘాల మీద, శాసనసభ్యుల మీద గౌరవం లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు, ఎం.వి.మైసూరారెడ్డి ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శించడంతో సీఎం కూడా విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి నేను మాత్రమే అవినీతిని నిర్మూలిస్తున్నాని, ఏదో పొడిచేస్తున్నాని అంటూ మాటలు మాట్లాడుతున్నారంటూ మైసూరా వ్యాఖ్యానించడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తనుగానీ, తన ఫేషీలోని గానీ వ్యక్తులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువులు చూపిస్తే దేనికైనా సిద్దమేనన్నారు. రెండున్నర గంటలు పాటు సాగిన ఈ చర్చ అనంతరం కాంగ్రెస్ కాస్తా మెత్తబడి నిరసన తెలియచేసి ఊర్కొంది. ఎం.ఐ.ఎం, సీపీఎంలు ముఖ్యమంత్రి సమాధానంతో సంతృప్తిచెందక సభ నుంచి వాకౌట్ చేశాయి.