వైఎస్ పాదయాత్రలు, మంత్రుల పర్యటనలు
హైదరాబాద్: కరువుతో అల్లాడుతోన్న రైతులకు సానుభూతి తెలపడంతో పాటు కరువు రైతుల కష్టాలను ఆలకించే ఉద్దేశంతోసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ నెల 9 నుంచి రాష్ట్రమంతటా పాదయాత్రలు నిర్వహించనున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. కరువు నివారణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను ప్రత్యక్షంగా వైఎస్ తిలకిస్తారనిసీఎల్పీ ఉపనేత డి.శ్రీనివాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మొత్తం 11 జిల్లాల్లో వైఎస్ పర్యటిస్తారన్నారు.పాదయాత్రలపై టీడీపీ చేస్తోన్న విమర్శలుఅర్ధరహితం. రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకోవడమే ఈ పాదయాత్రల ఉద్దేశం. అంతేకాకుండా రైతు మేం ఉన్నామనే భావన కల్పిచడం కూడా దీని ఉద్దేశమని ఆయన తెలిపారు.
మరోవైపు, వై.ఎస్ పాదయాత్రల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వై.ఎస్ పాదయాత్రలను కేవలం రాజకీయ దురద్దేశంతో చేపడుతున్నారు. దీన్ని మనవాళ్లు సమర్ధంగా తిప్పికొట్టాలి. రేపట్నుంచి ఇక్కడ (హైదరాబాద్ లో) ఎవరూ ఉండకూడదు.మీ మీ మీ నియోజకవర్గాల్లో పర్యటించండని చంద్రబాబు పార్టీసభ్యులకు ఆదేశాలు ఇచ్చారు.