సీఎం చంద్రబాబు రికార్డు పాలన
హైదరాబాబు: రాష్ట్రంలో అత్యధిక కాలం పాటు పనిచేసిన(చేస్తోన్న) ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. గురవారంతో ఆయన కాసు బ్రహ్మనందం రెడ్డి ఏడు సంవత్సరాల ఏడు నెలల పాలన రికార్డును అధిగమించారు. వైస్రాయ్ డ్రామా తర్వాత 1995 సెప్టెంబర్ 1న పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నేటితో ఏడు సంవత్సరాల ఏడు నెలల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు.
వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అత్యధిక కాలంపాటు పనిచేసిన కాంగ్రేసేతర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబే. కాసు బ్రహ్మనందారెడ్డి తర్వాత అత్యధిక కాలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవీని చేపట్టారు. ఎన్టీఆర్ నుంచి నాటకీయంగా పదవి చేపట్టిన చంద్రబాబు ఈ ఏడేళ్ళ కాలంలో వ్యక్తిగతం అధిక శాతం విజయాలనే చవిచేశారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు దేశ, విదేశాల్లో ఉత్తమ రాజకీయ నేతగా గుర్తింపు పొందడం ఆయన ఏడేళ్ళ పదవికాలంలో విజయాలు. రాష్ట్రం చంద్రబాబు పాలనలో ఎంతో కొంత అభివృద్ధి చెందినప్పటికీ, ఆయన ప్రచార ఆర్భాటానికి, అభివృద్దికి లంకె లేదని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలో హైటెక్ సిటీ, నగరం విస్తృతంగా అభివృద్ది చెందడం, డ్వాక్రాగ్రూపుల క్రీయాశీలత, ఇ-సేవ చంద్రబాబు పాలనలో మెచ్చుకోదగ్గ విజయాలు.
అయితే, పెరుగుతోన్న అప్పులు, విద్యుత్ రేట్లు, పారిశ్రామిక అభివృద్ది ఇసుమంత కూడా లేకపోవడం ప్రధాన వైఫల్యాలు. ప్రతిపక్షనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నట్లు ఎటువంటి వారినైనా నేర్పుగా ఒప్పంచే గుణం ఉన్న చంద్రబాబు - పెట్టుబడులను ఆకర్షించడంలో దారుణంగా విఫలమయ్యారు.అయితే, ఎన్టీఆర్ తర్వాత జాతీయ స్థాయిలో పేరు పొందిన రాజకీయ నేతగా చంద్రబాబు తొలిస్థానంలో ఉన్నారు. ఈయన సమకాలనీలు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు కూడా వారి వారి పార్టీల్లో ప్రైమ్ పొజిషన్లో ఉన్నారు.