ఇది దయాకరరావు పనే: సురేఖ
హైదరాబాద్: తమపై పోటా కేసు నమోదు కావడం వెనుక రాజకీయకుట్ర ఉందని శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఎర్రబెల్లి దయాకరరావు తమను రాజకీయంగా అణగదొక్కేందుకే ఈ కేసును నమోదు చేసేలా చేశారని ఆమె శుక్రవారం హైదరాబాద్ లో అన్నారు.
గురువారం కొండా సురేఖ, ఆమె భర్త మురళిపై హన్మకొండ పోలీసులు పోటా కింద కేసు నమోదు చేశారు. పోలీసులు హన్మకొండ బస్టాండు వద్ద సోదా జరుపుతుండగా మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక రివాల్వర్ తో పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, వార్ తో కొండా సురేఖకు, కొండా మురళికి సంబంధాలు ఉన్నాయని బయటపెట్టాడు.
అలాగే ప్రభుత్వ విప్ ఎర్రబెల్లి దయకరరావు హత్యకు కుట్ర వార్ తో కలిసి పన్నినట్లు వెల్లడించాడు. దీంతో సురేఖ తన భర్తతో కలిసి హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మరణించిన పీపుల్స్ వార్ నేత రామకృష్ణతో తమకు కావాల్సిన వాడని, అంతమాత్రానా, తమకు వార్ తో సంబంధాలను అంటగట్టడం అన్యాయమని ఆమె అన్నారు. దయాకరరావు కూడా ఆర్కేతో సంబంధాలు ఇదివరలో కొనసాగించారని, ఆ లెక్కన అతన్ని వదిలేసి మాపై పోటా కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న విషయం అర్థమవుతూనే ఉందని ఆమె చెప్పారు.
ఆమె భర్త కొండా మురళి మాట్లాడుతూ.. ఒక మహిళ అని కూడా చూడకుండా పోటా కేసు నమోదు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ సభ్యుడైన కొండా మురళిపై గతంలోనూ వరంగల్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉన్నాడని ఆ మధ్య అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే, కొండా సురేఖకు ప్రభుత్వం సెక్యురిటీని విరమించడంపై రాజకీయంగా అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.