వార్ అనుకూలుర్లలో పోటా భయం
హైదరాబాద్: శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మురళిపై కొండా మురళిపై పోటా కేసు నమోదు కావడంతో పీపుల్స్ వార్ అనుకూలురుగా వ్యవహరించే పౌరహక్కుల నేతలు, రాజకీయనేతల గుండెలు గుభేలుమంటున్నాయి. పోటాను ఆయుధంగా ఉపయోగించుకొని తమను వేధించే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత తన వైరి పక్షాల నేతలపై ఈ అస్త్రం ప్రయోగిస్తూ..వారిని భయపెడుతుండగా..తాజాగా రాష్ట్రంలో పోటా కింద కేసు బుక్ అయిన తొలి ఎమ్మేల్యే కొండా సురేఖనే. కొండా సురేఖ, ఆమె భర్త మురళికి, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు ఎప్పట్నుంచో వైరుధ్యాలున్నాయి.
అయితే, దయకరరావు హత్యకు వార్ తో కలిసి కుట్ర పన్నారని పోలీసులు చెపుతున్నా..ఇందులోని నిజానిజాలపై పలువురు మేధావులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ లపై నిరసన వెల్లడికాకుండా ఉండేందుకు తమపై కూడా ప్రభుత్వం పోటా ప్రయోగిస్తుందేమోనని పౌరహక్కుల నేతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే, పోలీసులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలుగా పోటా ప్రయోగించే ప్రసక్తే లేదని డిజిపి పేర్వారం రాములు శుక్రవారం స్పష్టం చేశారు. కొండా సురేఖ విషయంలో మహిపాల్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారమే..ఆధారాలు ఉండబట్టే వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.అని ఆయన తెలిపారు.