మైనారిటీలకు దగ్గర కావాలి: వాజ్పేయి
ఇండోర్: వచ్చే శాసనసభల ఎన్నికలు నిర్ణయాత్మక పాత్ర వహిస్తాయని, దేశ భవిష్యత్తు రాజకీయాల దిశను నిర్దేశిస్తాయని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు.
ప్రభుత్వ పనితీరే అంతిమ కొలమానమని ఆయన చెప్పారు. పార్టీ మైనారిటీలకు, బలహీనవర్గాలకు దగ్గర కావాలని ఆయన సూచించారు. గుజరాత్లో విజయం, ఆ వెంటనే హిమాచల్ ప్రదేశ్లో ఓటమి వచ్చే ఎన్నికలకు పార్టీ ఎంతో జాగ్రత్తగా సిద్ధం కావాలనే సందేశం ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్, చత్తీస్ఘర్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని, భవిష్యత్తు రాజకీయ ధోరణలను నిర్దేశిస్తాయని ఆయన అన్నారు. ఈ రాష్ట్రాల్లోని ప్రజలను పార్టీ కార్యకర్తలు చేరుకోవాల్సి వుంటుందని, ఇందుకు మీడియా కొంత ఉపయోగుపడుతుందని, అయితే పూర్తిగా ఉపయోగపడదని ఆయన అన్నారు. ప్రజలతో నిత్య సంబంధాలు కొనసాగించాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించగలదనే ఆశాభావం ఉన్నదని ఆయన అన్నారు.