కోటి ఉద్యోగాల కల్పన జోక్: లెఫ్ట్
భువనేశ్వర్: ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న ప్రధాని వాజ్ పేయి వ్యాఖ్య ఒక జోక్ గా సిపిఐ అభివర్ణించింది. అది ఈ ఏడాదిలోనే అతిపెద్ద అబద్దమని విమర్శించింది. దేశ ప్రజలపై, కార్మికులపై, నిరుద్యోగులపై ప్రధాని వేసిన నీచమైన జోక్ ఇది. ప్రజలు ఉద్యోగాలు లేక ఏడుస్తుంటే ప్రధాని కల్పన పేరుతో కల్పనలు అల్లుతున్నారు అని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏ.బి.బర్ధన్ ఆదివారం భువనేశ్వర్ లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
ప్రభుత్వరంగ సెక్టార్ లో ఉద్యోగాల కల్పన తగ్గిపోయిందని, ప్రైవేట్, వ్యవసాయరంగంలోనూ ఉఫాది కల్పన కొరవడిందని ఆయన తెలిపారు. ఇలాంటి స్థితిలో ప్రధాని ఇలాంటి అబద్దాలను ఎలా పార్లమెంట్ లో ప్రకటించగలరు? కేవలం వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిన అబ్దదపు ప్రకటన అదిఅని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో బిజెపి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాదిరిగానే దారుణమైన ఫలితాలను చవిచూస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఏప్రిల్ 8 నుంచి తమ పార్టీ భారతీయ జనజాగరణ్ యాత్ర నిర్వహించనుందని ఆయన తెలిపారు.