అంతటా తీవ్రవాదవ్యతిరేక భావమే: ప్రధాని
న్యూఢిల్లీ: అంతటా తీవ్రవాదానికి వ్యతిరేకమైన భావన ఉధృతమవుతోందని ప్రధాని వాజ్ పేయి పేర్కొన్నారు. కాశ్మీర్ లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురుతిరుగుతున్నారు, అందుకే నిస్పృహతో తీవ్రవాదుల ఊచకోత వంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల నడిమార్గ్ లో పండిట్ల ఊచకోత తీవ్రవాదుల నిస్పృహకు దర్పణం అని అన్నారు. తీవ్రవాదులు, వారిని ప్రోత్సహిస్తోన్న వారి ఉద్దేశాలు మాత్రం సఫలీకృతం కాలేదన్నారు. వారు కాశ్మీర్ పండిట్లను చంపి దేశంలో మతకల్లోహాలను సృష్టించాలని ప్రయత్నించారు. కానీ అలాంటి ఘటనలు ఏవీ జరగకపోవడంతో వారు తోకముడుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.
ప్రత్యేక రక్షణ దళాలకు చెందిన 18వ రైజింగ్ డే కార్యక్రమంలో సోమవారం ప్రధాని పాల్గొని ప్రసంగించారు. సరిహద్దు తీవ్రవాదాన్ని నిరోధించడంలో రక్షణదళాల పాత్రను ఆయన ప్రసంశించారు. సైనికుల, పోలీసుల ధైర్యసాహసాల వల్లే తీవ్రవాదుల ఆగడాలను అరికట్టగలిగామన్నారు.
అయితే, ప్రజాస్వామ్యంలో ఏ రక్షణ వ్యవస్థ స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని, ప్రజల ఆకాంక్షలు, రాజకీయ నాయకులు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోని మసలుకోవాలని ఆయన సూచించారు.