మధ్యవర్తిత్వానికి పౌ.హ.నేతలు నో
హైదరాబాద్: నల్లమల్ల అడవుల్లో పీపుల్స్ వార్ చెరలో ఉన్న నలుగురు పోలీసులను విడిపించేందుకు మధ్యవర్తిత్వానికి పౌరహక్కుల నేతలు నిరాకరిస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించాలన్న పోలీసులు వినతిని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మంగళవారం తోసిపుచ్చారు.
ఇంట్లో ఉండే అమాయక ప్రజలను తీసుకెళ్ళి కాల్చి చంపే పోలీసులకు మమ్మల్ని మధ్యవర్తిత్వం వహించమనే హక్కులేదు. మేం అంటేనే విలువ లేదంటూ ప్రవర్తించే పోలీసులు ఇప్పుడు తమ సిబ్బందిని విడుదల కోసం మా సాయం కోరడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. పౌరహక్కుల నేతలెవరూ దూతగా వెళ్ళడానికి సిద్దంగా లేరని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, నక్సల్స్ చెరలో ఉన్న పోలీసులను విడుదల చేసేందుకు రాజీ ప్రయత్నాలకు కూడా సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో తెలిపారు. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. నక్సలిజంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చంద్రబాబు అన్నారు. నక్సలిజం వల్ల పెట్టబడులు రావడం లేదని, దానివల్ల అభివృద్ది కంటుపడుతోందని ఆయన పునరుద్ఘాటించారు.