అట్టహాసంగా వైఎస్ పాదయాత్రలు
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 60 రోజుల పాటు నిర్వహించతలపెట్టిన పాదయాత్ర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ళల్లో వై.ఎస్. తన పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పీసీసీ నేత ఎం.సత్యనారయణరావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగించారు.
కరువు, పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన ప్రధాన అంశాలుగా వై.ఎస్. రాష్ట్రమంతా 11 జిల్లాల్లో 60 రోజుల పాటు పర్యటిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ను అందిస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళల్లో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ సారి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టలేదని, రైతుల పట్ల ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వై.ఎస్ విమర్శించారు. తెలంగాణా ప్రాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణా డిమాండ్ ను అధిష్టానానికి తెలియచేశామని, కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణాకు సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. అంతకుముందు ఉదయం, హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద పాదయాత్రను వై.ఎస్ ప్రారంభించారు.
గాంధీభవన్ వద్ద ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దయెత్తున గుమిగూడారు. పాదయాత్ర ప్రారంభ సూచకంగా బాణాసంచా కాల్చారు. గాంధీభవన్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆయా జిల్లాల్లో రాజశేఖర్ రెడ్డికి సంఘీభావంగా ఆ జిల్లాల పార్టీ శాసనసభ్యులు, నాయకులు పాదయాత్రలో పాల్గొంటారు.