ప్రధానితో మాట్లాడుతా: చంద్రబాబు
హైదరాబాద్: డిమాండ్ల పరిష్కారానికి తాను ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అఖిల భారత మోటారు వాహనాల సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంఘంనాయకులు శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు.
సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాల్సిందిగా వారు ముఖ్యమంత్రినికోరారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా ప్రతిస్పందిస్తూ ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని కూడా సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమస్య లేదని, కేంద్రప్రభుత్వం వల్లనే సమస్య ఉత్పన్నమవుతోందని సంఘం నాయకులు అన్నారు. తమ పరిధిలో ఉన్న లారీ యజమానుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి చెప్పారు. రేపటి సమావేశంలో సమస్య రాష్ట్రానికి సంబంధించి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.