లారీ సమ్మె: ఆర్టీసీకి లాభాల పంట
హైదరాబాద్: లారీల సమ్మె మరికొన్నాళ్ళు ఇలాగే కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ యజమాన్యం మనసులో గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే...నష్టాల బాటలో నడుస్తోన్న ఆర్టీసీకి లారీల సమ్మె ఆయాచిత వరంలా కలిసొచ్చింది. లారీల సమ్మె కారణంగా నిత్యావసర సరకుల పంపిణీకి రాష్ట్రప్రభుత్వం, వర్తకులు ఆర్టీసీని ఆశ్రయించారు. ఆర్టీసీ సరుకుల పంపిణీ వల్ల రోజుకు 60 లక్షల వరకు ఆదాయాన్ని అదనంగా సమకూర్చుకోగలుగుతోంది.
గత నాలుగు రోజుల్లో ఆర్టీసీ రెండున్నర కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది. కోస్తాలోని పలు ప్రాంతాల నుంచివిజయవాడకు సరుకుల పంపిణీకి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు కూడా ఇప్పుడు ఆర్టీసీనే వినియోగించుకుంటున్నారు. కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం ఆర్టీసీని అడ్డుకుంటున్నప్పట్టీకి ఆర్టీసీ సరుకుల పంపిణీని కొనసాగిస్తుంది.
ఇక మీదట సమ్మె ముగిసిన తర్వాత కూడా సరుకుల పంపిణీపై దృష్టి సారించాలని ఆర్టీసీ భావిస్తోంది. తద్వారా నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలపై భారం పడకుండా, టికెట్ ధరలు మాటిమాటీకి పెంచకుండా చూసుకోవచ్చిన ఆర్టీసీ గ్రహించింది.