ముదిరిన కాంగ్రెస్ యాత్రల వివాదం
హైదరాబాద్: యాత్రలవివాదం రాష్ట్ర కాంగ్రెస్లో మరింత ముదిరింది. చిత్తూరు నుంచి ఎఐసిసి కార్యదర్శి వి. హనుమంతరావు చేపట్టదలిచిన సోనియా సందేశ్ యాత్రకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రావు సోమవారంనాడు అనుమతి నిరాకరించారు. ఈ యాత్రను ప్రారంభించడానికి రావాల్సిందిగా కోరడానికి తనను కలవడానికి వచ్చిన హనుమంతరావుపై సత్యనారాయణారావు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం యాత్రకు ఇది పోటీ యాత్ర అని అనుకుంటారనే ఉద్దేశంతో ఆయన హనుమంతరావు యాత్రకు అనుమతి నిరాకరించారు. ఈ స్థితిలో ఇరువురు నేతల మధ్యవివాదం మరింతగా ముదిరింది.
సోనియా సందేశ్ యాత్రను నిర్వహించి తీరుతానని వి. హనుమంతరావు అంటున్నారు. ఆయన ఈ నెల 29వ తేదీన ఈ యాత్రను ప్రారంభించాలన తలపెట్టారు. హైకమాండ్కు తెలియజేసి తన యాత్రను ప్రారంభిస్తానని ఆయన చెప్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ బ్లాక్ కమిటీల సమావేశాల సందర్భంగానే తాను ఈ యాత్ర గురించి ప్రకటించానని, ఆ సందర్భంలో సత్యనారాయణరావు ఏమీ అనలేదని ఆయన అంటున్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి యాత్రకు అనుమతి అవసరం లేనప్పుడు తన యాత్రకు అనుమతి ఎందుకని ఆయన అడుగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ జెండాను మోసుకుని పోతే అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు.
వై.యస్. రాజశేఖర్ రెడ్డి యాత్రకు ముందే అనుమతి ఇచ్చామని సత్యనారాయణ రావు అంటున్నారు. జాతీయ నాయకుడైన హనుమంతరావు ఇలా చేయడం ఏమీ బాగా లేదని ఆయన అభిప్రాపయడుతున్నారు. ఎఐసిసి కార్యదర్శి అయిన హనుమంతరావు ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఈ యాత్ర చేపట్టవచ్చునని ఆయన అంటున్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి యాత్ర ముగిసిన తర్వాతనే ఏ యాత్రకైనా అనుమతి ఇస్తామని ఆయన గట్టిగా చెబుతున్నారు.