ఆక్సిజన్ ఆగి మరణాలు- ఆందోళన
కర్నూలు:ఆక్సిజన్ నిలిచిపోయి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో నలుగురి మరణానికి కారణమైనవైద్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోనిఅక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ వార్డులో సోమవారం ఉదయం రెండు గంటల పాటుఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నలుగురు మరణించారు.
వామపక్షాలు శవయాత్ర నిర్వహించాయి. ఆస్పత్రి సూపరింటిండెంట్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశం మేరకు జిల్లా మంత్రులు బి.వి. మోహన్ రెడ్డి,కె. ఇ. ప్రభాకర్ ఆస్పత్రిని సందర్శించారు. విచారణలో తేలిన తర్వాతనే ఈ సంఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. మంత్రులు వైద్యులను, బాధితులను కలిశారు. రోగం ముదరడం వల్లనే వారు మరణించారని,ఆక్సిజన్ అందక కాదని వైద్యులు మంత్రులతో చెప్పారు. గంటసేపు ఆక్సిజన్ అందకపోవడం వల్లనే తమవారు మరణించారని బాధితులు చెప్పారు.