చర్చలకు పీస్ ఇన్సియేటివ్ విజ్ఞప్తి
హైదరాబాద్: చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని పీస్ ఇన్సియేటివ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి,పీపుల్స్వార్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇరు పక్షాలకు కమిటీ ఒక లేఖ రాసింది. ఈవివరాలను కమిటీ సభ్యుడు బొజ్జా తారకం శుక్రవారంవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రెండు పక్షాలు పట్టింపులకు పోకుండా పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించి చర్చల ప్రక్రియను తిరిగి మొదలుపెట్టాలని ఆయన కోరారు. ఆయుధాలకు స్వస్తి చెప్తేనేపీపుల్స్వార్ నక్సలైట్లతో చర్చలు జరుపుతామనే ప్రభుత్వ ధోరణిని ఆయన ఖండించారు. ప్రభుత్వ ధోరణిసరైంది కాదని ఆయన అన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా ఇరు పక్షాల మధ్య చర్చలు జరగడం అవసరమని ఆయన అన్నారు. హింస, ప్రతిహింసలను ఆపేసి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచాలని ఆయన ఇరు పక్షాలకువిజ్ఞప్తి చేశారు. పీపుల్స్వార్ నేతలతో నేరుగా ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని మరో సభ్యుడు ఎం.టి.ఖాన్ కోరారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.