20 రోజులు పూర్తయిన వై.ఎస్ యాత్ర
కరీంనగర్: సీఎల్పీ నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటితో 20 రోజులకు చేరుకొంది. ఇప్పటివరకు ఆయన యాత్ర దిగ్విజమైంది. మరో 40 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగుతుంది. సోమవారం నాడు మాత్రం వై.ఎస్ ఇరుకున పడ్డారు. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో తన పాదయాత్రను ప్రారంభించిన వై.ఎస్ ఇందుర్తి మండలంలోని ఓ గ్రామంలో సభను నిర్వహించారు.
కాంగ్రెస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే ఉమావెంకటేశ్వర్ అసలు తమ గ్రామాల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వై.ఎస్ కు గ్రామాస్థులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అప్పుడు కన్పించిన ఆయన మళ్ళీ ఇప్పుడు మీతోనే కన్పించారంటూ చెప్పడంతో వై.ఎస్ ఇబ్బందిపడ్డారు. మరోవైపు, వై.ఎస్ ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వై.ఎస్ తల్లిగారు, ఆయన భార్య, కూతురు ఆకునూరు గ్రామ విడిదిలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వై.ఎస్ తల్లి విలేకరులతో మాట్లాడుతూ..45 డిగ్రీల ఎండలో తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకోవద్దని వైఎస్ కు చెప్పినట్లు ఆమె తెలిపారు. యాత్ర టైమింగ్స్ మార్చుకోమని ఆమె సలహా ఇచ్చారు.