వావిలాల గోపాలకృష్ణయ్య కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున కన్ను మూశారు.శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్ర్య సమరంలోనే కాకుండా మద్యపాన నిషేదం వంటి పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వావిలాల మృతి రాష్ట్రాన్నివిషాదసముద్రంలో ముంచింది. రెండేళ్ల క్రితం ఆయన పక్షవాతానికి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో ఆయన గత నెల 15వ తేదీన నిమ్స్లో చేరారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కొంత కాలంగా ఆయన కేవలం మందులతోనే బతికారు. ఆహారం తీసుకోలేకపోవడంతో మందులతోనే వైద్యులు ఆయన ప్రాణాలను నిలుపుతూ వచ్చారు. చివరకు ఆయన మంగళవారం కన్ను మూశారు.
వావిలాల భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా పలువురు ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. తనను ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ఏవిలువల కోసమైతే స్వాతంత్ర్య పోరాటం సాగిందో ఆవిలువలను కాపాడాలని వావిలాల కోరేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ మహోన్నత వ్యక్తి మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆయనఅన్నారు.
ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకు హెలికాప్టర్లో తరలిస్తారు. అక్కడి నుంచి సత్తెనపల్లికి రోడ్డు మార్గం ద్వారా తీసికెళ్తారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరుగుతాయి.