కరువు చర్యలు ఏమైనట్లు?: వైయస్
వరంగల్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేర చేపట్టిన పాదయాత్ర ఆదివారంనాటికి 26వ రోజుకు చేరుకుంది. ఆయన ఆదివారంనాడు వరంగల్ జిల్లాలోని నర్సన్నపేట, మహబూబాబాద్ మండలాల్లో పర్యటించారు.
ఈ ప్రాంతాల్లోని గిరిజన తండాల్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు విశేష ప్రతిస్పందన లభించింది. లక్ష్మీపురం తండాలోని కాంగ్రెస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆయన ముందే తగాదాకు దిగారు. ఇరు వర్గాలకు ఆయన నచ్చజెప్పడంతో తగాదా ముగిసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో రేషన్ కార్డులపై మంచినీళ్లు సరఫరా చేస్తున్న విషయం ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ఇది అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. మంచినీళ్ల సమస్యను కూడా పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని, ఇక కరువు నివారణ చర్యలు ఏం చేపట్టినట్లని ఆయన అన్నారు.