ఇంటర్ ఫస్టియర్: బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయిగా వుంది. ఈ పరీక్షా ఫలితాలను ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎన్.ఎండి. ఫరూఖ్ సోమవారం విడుదల చేశారు.
మొత్తం 5 లక్షల 76 వేల 143 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్ష రాయగా లక్షా 96 వేల 198 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 34 శాతం ఉంది. ఇందులో బాలికలు 38 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 31.26 శాతం మంది పాసయ్యారు. ఫెయిల్ అయినవారికి వచ్చే నెల 18వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
ఇదిలా వుంటే, హైదరాబాద్లో మంత్రి ఫలితాలు విడుదల చేయడానికి మూడు గంటల ముందే చిత్తూరు జిల్లాలో ఒక జిరాక్స్ సెంటర్ యజమాని ఫలితాలను అమ్మకానికి పెట్టాడు. మంత్రి హైదరాబాద్లో సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి ఫరూఖ్ చెప్పారు.