సురేంద్రబాబుకు బెయిల్ తిరస్కృతి
విజయవాడ: ఏడాదిన్నర క్రితం విజయవాడలో జరిగిన లాకప్ డెత్ కేసులో నగర పోలీసుకమీషనర్ కు చుక్కెదురైంది. ఈ కేసులో మెట్రోపాలిటన్ కోర్టు కమీషనర్ ఎన్.వి. సురేంద్రబాబు సహా ఐదుగురు పోలీసులను నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ లు జారీ చేసిన విషయం తెలిసిందే. సురేంద్రబాబు బెయిల్ పిటీషన్ ను గురువారం కోర్టు కొట్టిపారేసింది.
జామీనుదారుల పూచీకత్తుతో కోర్టులో ఆయన హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు, కమీషనర్ కు మద్దతుగా కొంతమంది విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. బుడ్డాశంతన్ మరణానికి విజయవాడ కమీషనర్, ఎసిపి, ఎస్ లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు కారణమని విజయవాడ మెట్రో పాలిటన్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకున పడింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోర్టు నిర్ణయమే శిరోధార్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.