గుత్ప ప్రాజెక్టు కోసం భారీ ర్యాలీ
నిజామాబాద్: గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారంనాడు రైతులు, మహిళలు ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గంటల పాటు ఆర్మూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ రోడ్డుకుఇరువైపులా ఆగిపోయింది.
ఆర్మూర్ ప్రాంతంలోని 52 గ్రామాలకు చెందిన నాలుగు వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ 26 మంది రైతులు ఆర్మూర్ మండల కార్యాలయం వద్ద గత ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.వీరికి మద్దతుగా 52 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఆర్మూర్ తరలివచ్చారు. మార్కెట్ యార్డు నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ పథకంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులంటున్నారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు.