దేశం మహానాడుకు వర్షం దెబ్బ
తిరుపతి: తెలుగుదేశం మహానాడుకు వర్షందెబ్బ తగిలింది. తిరుపతిలో సోమవారం కురిసిన వానకు మహానాడు ప్రాంగణం కుప్పకూలింది. తెలుగుదేశం మహానాడు ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్నది.
సోమవారం కురిసిన వడగళ్ల వానకు,వీచిన ఈదురుగాలులకు తిరుపతి హస్తకళా రామం ప్రాంగణం మొత్తం కుప్పకూలింది. భోజనశాలకు చెందిన ఇనుపరేకులు కుప్పకూలాయి. భారీ కటౌట్లు కూడా నేల కూలాయి. దాదాపు 8 వేల మందికూర్చోవడానికి వీలుగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 35వేల మంది భోజనాలు చేయడానికివీలుగా భోజనశాలను ఏర్పాటు చేశారు. మహానాడు అనుకున్న స్థలంలోనే జరుగుతుందని మంత్రి గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. భోజనాలు పెట్టడానికి ఎనిమిది కళ్యాణమండపాలను తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
వడగళ్ల వానకు, ఈదురుగాలులకు సభా ప్రాంగణం కూలిన వెంటనే తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులంతా అక్కడికి చేరుకున్నారు. ఈవిషయం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడారు.
ఇదిలావుంటే, మహానాడులో చేయబోయే రాజకీయ తీర్మానం గురించి సోమవారం విస్తృతంగా చర్చలు జరిగాయి. తీర్మాన కమిటీ, మహానాడు కమిటీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపాయి. మహానాడులో ప్రవేశపెట్టే 23 తీర్మానాలపై 60 మందికిపైగా మాట్లాడుతారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవుతారు.