పూర్తి వడ్డీ మాఫీకి బాబు డిమాండ్
తిరుపతిః రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్రత దృష్ట్యా దుర్భిక్ష ప్రాంతాల్లో నూరు శాతం వడ్డీ మాఫీ చేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈవిషయంలో కేంద్రానికి ఎన్నోసార్లువినతి పత్రాలు సమర్పించామని మహానాడులో చేసిన అధ్యక్షోపన్యాసంలో ఆయన ప్రస్తావించారు.
దివంగత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఘటించిన అనంతరం చంద్రబాబు నాయుడు మహానాడు వేదికమీద అధ్యక్షోపన్యాసం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో సాధించిన అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. గత పదేళ్ళలో మూడేళ్ళు కాంగ్రెస్ పాలించగా తెలుగుదేశం ఏడేళ్ళు పాలించిందని, గత దశాబ్దకాలంలో రాష్ట్రం సాధించినగణనీయ ప్రగతికి తమ పార్టీ బాటలు వేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఎన్నికల ఉపన్యాసంలా ఉద్వేగభరితంగా సాగింది.
నక్సలిజం, ముఠా కక్షలు, రౌడీయిజం, మతకలహాలు రాష్ట్రాన్ని పీడిస్తున్న సమయంలోఅధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిందని ఆయనపేర్కొన్నారు. ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తూనే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అధికారం కోసం అర్రులు సాచకుండా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, ఈ కారణంగానే దేశంలోనే అత్యధికంగా నిధులుసేకరించుకోగలిగామని చంద్రబాబు నాయుడు చెప్పారు.