రైతులకు సమగ్ర ప్యాకేజీ: బాబు
తిరుపతి: రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ఒక సమగ్ర ప్యాకేజీని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ ప్యాకేజీపై వచ్చే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని వచ్చే ఖరీఫ్సీజన్ నుంచి అమలు చేస్తామని ఆయన చెప్పారు.
ఆయన బుధవారం మహానాడులో ప్రవేశపెట్టిన వ్యవసాయ తీర్మానంపై ప్రసంగించారు. పంటల బీమాకు వంద కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల దీర్ఘ కాలిక రుణాలపై అపరాధ వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని, ఈ రుణాలపై ఐదు శాతం వడ్డీని మాఫీ చేస్తామని, దీని వల్ల రైతులు 250 కోట్ల రూపాయల మేరకువిముక్తి చెందుతారని ఆయన చెప్పారు. అన్ని రకాల విత్తనాలపై సబ్సిడీ ఇస్తామని ఆయన చెప్పారు. ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 1125 ఎత్తిపోతలు ఉండా 575 పని చేయడం లేదని, 35 కోట్ల రూపాయలతోవీటిని పునరుద్ధరించి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.