కర్ణాటకపై పోరుకు బాబు సిద్ధం
హైదరాబాద్: వివిధ నదులపై నిబంధనలకు వ్యతిరేకంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న కర్ణాటక ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కర్ణాటక తీరునువిమర్శించిన తనపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. చంద్రబాబు పోరాటం చేయాల్సింది తమపై కాదని,పీపుల్స్వార్ నక్సలైట్లపై అని ఆయన ఎస్.ఎం. కృష్ణ గురువారం అన్నారు. కృష్ణ చేసిన ఈ వ్యాఖ్య బాధ్యతరహితమైనదని చంద్రబాబు అన్నారు. ప్రధానమైన పదవుల్లో ఉన్నవారు పదాల వాడకంవిషయంలో జాగ్రత్త వహించాలని ఆయన ఎస్.ఎం. కృష్ణను ఉద్దేశించి అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నదీ జలాలవిషయంలో మన రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని ఆయన చెప్పారు. చిత్రావతి నదిపైపరగోడు ప్రాజెక్టును ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం కర్ణాటకను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
పరగోడుపై కర్ణాటక చేసిన వాదన తప్పు అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప శుక్రవారం అనంతపురంలో అన్నారు. మంచినీటి కోసమేపరగోడు ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు కర్ణాకట చేస్తున్న వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను తాముసేకరించామని, పరగోడు కింద 600 ఎకరాల ఆయకట్టును కర్ణాటక స్థిరీకరిస్తున్నట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయని ఆయన చెప్పారు. కర్ణాటకపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.జూన్ మొదటి వారంలో తెలుగుదేశం ఆధ్వర్యంలోపరగోడు వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడు శుక్రవారం అనంతపురంలో విమర్శించారు. నియమనిబంధనలు తుంగలో తొక్కి కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన అన్నారు. కర్ణాటక చేత ప్రాజెక్టుల నిర్మాణానలు ఆపించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.