బాబు జవాబు చెప్పాలి: కెసిఆర్
కరీంనగర్: తెలంగాణ వెనుకబాటుతనంపై సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతకె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు.సమైకాంధ్రలోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు తిరుపతి మహానాడులో చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ కెసిఆర్ శుక్రవారం ఈ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరగలేదని నిరూపిస్తే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులవిషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తాను చంద్రబాబుతో నాగార్జునసాగర్లో గానీ,శ్రీశైలంలో గానీ చర్చకు సిద్ధమేనని, తెలంగాణకు అన్యాయం జరగలేదని చంద్రబాబు నిరూపిస్తే తాను ఆ రిజర్వాయర్లలో దూకి ప్రాణత్యాగం చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రాంతంవారు తెలంగాణవారి ఉద్యోగాలను కొల్లగొట్టలేదా అని ఆయన ప్రశ్నించారు.
సమైక్యాంధ్ర తెలంగాణకే నష్టమని ఆయన అన్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలనుదెబ్బ తీసేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వివిధ వర్గాలకు వరాలు కురిపించారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ఐదు చిన్న రాష్ట్రాల జాతీయ కమిటీ ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. జగిత్యాల జైత్రయాత్రకు మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి హాజరవుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు.