బాబు సవాల్కు వైయస్ సై
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన సవాల్కు తాము సిద్ధమేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. బహిరంగ చర్చకు వేదికను, సమయాన్ని తేదీని చంద్రబాబు నిర్ణయించాలని, అంతేకాకుండా మధ్యవర్తులను కూడా ఆయన నిర్ణయించుకోవచ్చునని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
రాజశేఖర్ రెడ్డి శుక్రవారంనాడువిశాఖపట్నంలోని నర్సీపట్నం నియోజకవర్గంలో తన పాదయాత్ర నిర్వహించారు. బహిరంగ చర్చవిషయంలో చంద్రబాబు ఇప్పుడైనా మాట మీదనిలబడాలని ఆయన సవాల్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎర్రవరం నుంచి బొడ్డేపల్లి వరకు ఆయన 14 కిలోమీటర్లు నడిచారు. కాళ్ల నొప్పుల వల్ల కొద్దిసేపుప విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం పాదయాత్ర చేయలేదు. శనివారం ఉదయం యధావిధిగా పాదయాత్ర సాగుతుంది.
తన పాదయాత్ర సందర్భంగా ఆయన కొన్ని ప్రాంతాల్లో ఓపెన్టాప్ జీపు నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పంచదార సహకార సంఘాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఈవిషయంలో ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోవిఫలమైందని పదవ పంచవర్ష ప్రణాళిక స్పష్టం చేసినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులకు ఉచితవిద్యుత్ ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వం కరెంట్ను అమ్ముతోందని ఆయన అన్నారు.