నలుగురు టీడీపీ నేతల హత్య
హైదరాబాద్: రాయలసీమలో మరోమారు రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శనివారం నలుగురు టీడీపీ కార్యకర్తలు ఈ కక్షలకు బలయ్యారు. తెలుగుదేశానికి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడితో పాటు ముగ్గురు పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు. అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం గరిశనపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రామ్మోహనరెడ్డి వర్గానికి చెందిన 20 మంది మండల కేంద్రం నుంచి రెండు ట్రాక్టర్ లలో వచ్చి ఎంపీటీసీ సభ్యుడు బెస్త మల్లికార్జున్ ఇంటిపై బాంబులతో దాడి చేశారు. మల్లికార్జున్ ను అతిదారుణంగా నరికివేశారు.
బాంబుల శబ్దానికి లేచిన మల్లికార్జున్ కుమారుడు శ్రీనివాసులు, ఆయన బంధువులు బెస్త నారయణప్పా, బెస్తఅశోక్ లు కూడా ఈ దాడిలో బలయ్యారు. రాజకీయ కక్షలే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. చనిపోయినవీరంతా ఎమ్మెల్యే పరిటాల రవి అనుచరులుగా భావిస్తున్నారు.