అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు: పాక్
లండన్: జమ్మూ కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం ప్రభావం ఉన్నదని పాకిస్థాన్ పరోక్షంగాఅంగీకరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపడానికి తమ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేదీ లేదని వ్యాఖ్యానించింది. అయితే ఈవిషయంలో భారత్కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చింది.
సీమాంతర ఉగ్రవాదం కొనసాగాలని తాము ఎప్పుడూ చెప్పలేదని, అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపడానికి తమ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి కుర్షీద్ మెహమూద్ కసూరి ఆదివారం రాత్రి బిబిసితో అన్నారు. అమెరికా సైతం మెక్సికో సరిహద్దును మూసేయలేకపోయిందని ఆయన అన్నారు.
కొంతమంది సరిహద్దు దాటుతుంటే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లక్షలాది మంది భారతసైనికులు సైతం ఆపలేకపోతున్నారని, ఇటువంటి స్థితిలో చొరబాట్లను ఆపడానికి తమ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేదైనా ఉందా అని ఆయన అన్నారు. కాశ్మీర్తో సహా అన్ని సమస్యలపై భారత్, పాకిస్థాన్ల మధ్య చర్చలు జరగాలని, అప్పుడే మంచి ఫలితాలు రాగలవని, ఆ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
దురదృష్టవశాత్తు భారత్తో తాము మూడు యుద్ధాలు చేశామని, నిరుడు పరిస్థితి యుద్ధం దాకా వెళ్లిందని, ఇప్పుడు యుద్ధం గురించి ఆలోచన రాకుండా ప్రయత్నాలు జరగాల్సి వున్నదని, అప్పుడే పరస్పర సహకారంపెంపొందుతుందని ఆయన అన్నారు.