వేడిగాలుల మృతులు- రాష్ట్రపతి ఆందోళన
కుప్పం (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్లో వడగాడ్పుల వల్ల మరణాలు సంభవిస్తుండడం పట్ల రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని పిఇఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్సెన్సెస్ అండ్ రీసెర్చ్ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలోని డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్సెంటర్కు ఆయన శంకుస్థాపన చేశారు.
వడదెబ్బను ఎదుర్కునేందుకు శాస్త్రజ్ఞులుపరిశోధనలు చేయాలని ఆయన సూచించారు. విపరీత వాతావరణ ధోరణులను నిరోధించి ప్రజలకు రక్షిత మంచినీరు, వైద్యసేవలు అందేలా శాస్త్రజ్ఞులు, మేధావులు కృషి చేయాలని ఆయన అన్నారు. హెచ్ఐవి, క్షయ వంటి రోగాల నివారణకు జాతీయ ఆరోగ్య సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కుప్పంలో ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలను ఆయన సందర్శించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆయన కుప్పంలో గడిపారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు. తిరిగి ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.