పాతబస్తీ ప్రశాంతం, పరిస్థితి అదుపులోనే
హైదరాబాద్: రెండు రోజుల పాటు అల్లర్లతో అట్టుడికిన పాతబస్తీలోని మల్లెపల్లి, హబీబ్ నగర్,ఆగాపూర్, అప్జల్ గంజ్, శాంతినగర్ ప్రాంతాల్లో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి పోలీసులు చేపట్టిన శాంతి యత్నాలు ఫలించాయి. శనివారం పూర్తిగా పోలీసులు అదుపుల్లోకి వచ్చింది. తిరిగి యధావిధిగా ఇక్కడ ప్రజాజీవనం మొదలైంది. దుకాణాలు తెరుచుకున్నాయి. వాణిజ్య కలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రజల్లో ఇంకా భయాందోళనలు వీడలేదు. చాలా మంది బయటికి రావడానికి జంకారు.
ఈ ప్రాంతాల్లో ఉదయం రైల్వే శాఖ సహాయ మంత్రిబండారు దత్తాత్రేయ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అల్లర్లను మత ఘర్షణలుగా చిత్రీకరించలేమన్నారు. ఇవి కేవలం ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలేనని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి కె.విజయరామారావు కూడా శనివారం పాతబస్తీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. మరో రెండు రోజులు పోతేఅంతా నార్మల్ గా మారుతుందని ఆయన విలేకరులతో అన్నారు.