గురువారం నుంచి దేశం యాత్రలు
హైదరాబాద్: విపక్షాల యాత్రలకు, ఆందోళనలకు విరుగుడుగా తెలుగుదేశం పార్టీ గురువారం నుంచి భారీ ఎత్తున జనచైతన్య యాత్రలను చేపట్టనుంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన కోటి వరాలపై ప్రచారం చేయడం కూడా ఈ యాత్రలో ప్రధాన ఎజెండా. వై.ఎస్ పాదయాత్రలకు ధీటుగా తొలుత యాత్ర నిర్వహించాలని భావించనప్పటికీ, ఈ యాత్రలను ప్రస్తుతం వరాలకు ప్రచారంపైనే దృష్టి సారించాలని పార్టీ భావిస్తోంది.
రాష్ట్రమంతటా గురువారం ప్రారంభం కానున్న ఈ యాత్రలు పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జిలు అధ్వర్యంలో జరిగే ఈ చైతన్య యాత్రలలో పార్టీ నేతలు అందరూ పాల్గొంటారు.
గ్రామాల వరకు ఎవరికివారు ఎలా వెళ్ళినా గ్రామంలో మాత్రం పాదయాత్రే చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఉదయానికే గ్రామాలకు చేరుకునేందుకు నేతలు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి ఈ పదిరోజుల కార్యక్రమంలో మధ్య మధ్యలో ఆకస్మిక తనిఖీ చేస్తారు.