వైభవంగా వైయస్ యాత్ర ముగింపు
శ్రీకాకుళం: గత 68 రోజల కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం ముగిసింది.శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద ఆయన తన పాదయాత్రను ముగించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర 14,070 కిలోమీటర్లు సాగింది.
రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర చివరి రోజు 15 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆంధ్రాఒరిస్సా సరిహద్దుల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం ఆంధ్రప్రదేశ్సీనియర్ నేతలతో పాటు ఒరిస్సా కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. రాజశేఖర్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఏ రాజకీయ నేతా చేయని సాహసం రాజశేఖర్ రెడ్డి చేశారని వారు కొనియాడారు.
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల కాంగ్రెస్కు జవసత్వాలు సమకూరాయని, ఈ పాదయాత్ర వల్ల కార్యకర్తల్లో కలిగిన చైతన్యాన్ని నిలబెట్టడానికి కార్యక్రమాలు తీసుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. వైయస్ పాదయాత్ర వల్లఅందరిలో జాగృతం కలిగిందని ఆయన అన్నారు. మొదటవిమర్శలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజశేఖర్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నారని, తెలుగుదేశం జనచైతన్య యాత్రలు ఇందులో భాగమేనని ఆయన అన్నారు.
తన రాజకీయ జీవితంలో పాదయాత్ర మహత్తర ఘట్టమని రాజశేఖర్ రెడ్డి అన్నారు. తన పాదయాత్ర వల్ల ప్రజాసమస్యలు మరింత లోతుగా అవగాహనకు వచ్చాయని ఆయన చెప్పారు. తన పాదయాత్ర ఉద్దేశం నెరవేరిందని, ప్రజా సమస్యలు తెలిశాయని ఆయన అన్నారు. తన పాదయాత్ర వల్ల ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
వై.యస్. పాదయాత్ర ఘట్టానికి స్ఫూర్తిగా ఇచ్చాపురంలో ఒక స్థూపాన్ని నిర్మించారు. దానిపై పంచెకట్టు, బూట్లుచిహ్నాలతో పాటు కాంగ్రెస్ చిహ్నం హస్తం గుర్తు కూడా ఉంది.