ప్రమాదంపై సింగరేణి కార్మికుల సమ్మె
రామగుండం: రామగుండం సింగరేణి గనుల్లో జరిగిన ప్రమాదంలో 17 మంది గల్లంతయిన సంఘటనకు నిరసనగా కార్మికులు సమ్మె చేశారు. రామగుండంలోని 25 గనుల కార్మికులు మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు.
ఆగ్రహించిన కార్మికులు సింగరేణి అధికారులనుఘెరావ్ చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బంద్ పాటించారు. గనిలో అకస్మాత్తుగా నీరు వచ్చి చేరడంతో గల్లంతయిన 17 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు జరుగుతున్నాయి. వారు బతికి వుంటారనే ఆశ ఏ మాత్రం లేదు. గనిలోని నీటిని వేగంగా తోడేస్తున్నారు. నాలుగు మోటార్లతో నీటిని తోడేసే కార్యక్రమం సాగుతోంది. సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి నీటిని తోడేసే కార్యక్రమం నడుస్తోంది. గనిలో నీరు చేరడంతో పాటు బొగ్గు కూడా కప్పబడి ఉంది. ప్రమాదం జరిగిన గనిని కొంత కాలం మూసివేశారు. ఆ తర్వాత తెరిచారు. ప్రమాద స్థలి వద్ద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.