భద్రతాలోపమే గని ప్రమాదానికి కారణం
కరీంనగర్: అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్లనే సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం సంభవించిందని ఉన్నతస్థాయి అధికారుల తనిఖీ బృందం అభిప్రాయపడింది. రవీంద్రశర్మ, లక్ష్మణ్చందాలతో కూడిన తనిఖీ బృందం గురువారంనాడు ప్రమాదస్థలిని పరిశీలించింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండం బొగ్గుగనిలో నీరు ప్రవహించడంతో 17 మంది కార్మికులు జలసమాధిఅయిన విషయం తెలిసిందే. 17 మృత దేహాలను బుధవారంనాడే వెలికితీశారు.
భద్రత విషయంలో అధికారులు అశ్రద్ధ ప్రదర్శించారని అధికారుల బృందం అన్నది. బొగ్గు తవ్విన ఛాంబర్పైన తిరిగి బొగ్గు తవ్వే పనిని చేపట్టారని, ఈ సమయంలో తగిన ప్రమాణాలను పాటించలేదని, దాంతో ప్రమాదం సంభవించిందని వారన్నారు. గనిలోకి చేరిన నీటిని బయటకు పంపడానికి తగిన విధానం కూడా లేదని వారు గుర్తించారు. ప్రమాదంవిషయంలో ఎవరికి వారే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. తమ నివేదికను ప్రభత్వానికిఅందజేస్తామని వారు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తివిచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటారని వారన్నారు.