బాబు బృందానికి ప్రధాని హామీ
న్యూఢిల్లీ: వివాదాస్పదపరగోడు ప్రాజెక్టుపై, ఎగువ తుంగ ఆనకట్ట ఎత్తుపెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న యోచనపై వెంటనే చర్య తీసుకుంటామని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలోని అఖిల పక్ష బృందం శనివారం ప్రధానిని కలుసుకుంది.
ఎగువ తుంగపై ఆనకట్ట ఎత్తునుపెంచాలనే కర్ణాటక ప్రయత్నం గురించి, ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాలపై పడే ప్రభావం గురించి ప్రధానికివివరించినట్లు చంద్రబాబునాయుడు విలేకరులకు చెప్పారు. కోలార్ జిల్లాలో చిత్రావతి నదిపై కర్ణాటక ప్రభత్వం చేపట్టినపరగోడు ప్రాజెక్టు గురించి కూడా ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఒప్పందాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలుదెబ్బ తింటాయని అఖిల పక్ష బృందం ప్రతినిధులు అన్నారు.
అఖిల పక్ష బృందంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి, దివాకర్ రెడ్డి(కాంగ్రెస్), ఇంద్రసేనా రెడ్డి (బిజెపి), అసదుద్దీన్ ఓవైసీ (మజ్లీస్), ఎన్. నర్సింహయ్య(సిపిఎం)లతో పాటు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులుకె. ఎర్రంనాయుడు, సి. రామచంద్రయ్య, కరణం బలరాం ఉన్నారు.