పొత్తుకు ఎఐసిసి నేతల చర్చలు: కెసిఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి తమతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) నేతలు కొందరు చర్చలు జరుపుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ నేతల పేర్లు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీలో అత్యధికులు వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శుక్రవారం చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ పొత్తుల గురించి మాట్లాడడానికి ఆయన అతి సామాన్యుడని చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటే తాము పొత్తుకు సిద్ధపడుతామని ఆయన చెప్పారు.
గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన 164 కోట్ల రూపాయల్లో తెలంగాణకు కనీసం సగం నిధులు ఇప్పించగలరా అని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తెలుగుదేశంలోని తెలంగాణ నేతలకు, మంత్రులకు సవాల్విసిరారు.
పుష్కరాల నిధుల విడుదలలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు. పుష్కరాల నిధుల విడుదలలోనూ ప్రభుత్వం ప్రాంతీయవివక్షను పాటించడం దారుణమని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాలకు విడుదల చేసిన నిధుల్లో సగం తెలంగాణకుఇప్పించలేకపోతే తెలంగాణ గురించి మాట్లాడడం మానేయాలని ఆయన తెలంగాణకు చెందిన తెలుగుదేశం నేతలకు హితవు చెప్పారు.
ఇదిలా వుంటే, తెలుగుదేశంలోని తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బాకాలూదున్నారని తెలియజెప్పడానికి టిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం పల్లకీమోత కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుకు బాకాలూదడం మాని తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులను, తెలుగుదేశం శాసనసభ్యులను డిమాండ్ చేశారు. హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ టిఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.