ఊరంటే వణికిపోతున్న వాడాలవాసులు
కర్నూలు: కర్నూలు జిల్లా పాములపాడు మండలం వాడాల గ్రామ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గ్రామం వదిలిపెట్టి చాలా మంది వెళ్లిపోయారు. ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.విషపు పురుగు కాటేసి ఈ గ్రామవాసులు ముగ్గురు మరణించినవిషయం తెలిసిందే.
ఆస్పత్రి పాలైన 20 మంది కోలుకుంటున్నారు. అయితే వారు తిరిగి సొంతూరు వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామానికి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఏమీ భయం లేదని అధికారులు భరోసా ఇస్తున్నా వారిని భయం నీడలు వదలడం లేదు.విషపు పురుగు కుట్టడం వల్లనే మరణాలు సంభవించాయా, మరేదైనా కారణం ఉందా అనేది తేల్చడానికి వైద్యులు, ఇతర అధికారులు పరిశీలనలు జరుపుతున్నారు. అన్ని ఆరోగ్య చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మూఢనమ్మకంతో ఈ గ్రామ ప్రజలను ఇతర గ్రామాల వారు తమ ఊళ్లోకి రానీయడం లేదు. వారిని దరి చేరనీయడం లేదు.