ఇక్కడిదేం ఇటలీ మంత్రం: వెంకయ్య
హైదరాబాద్: విదేశాల్లో భారతీయ సంస్కృతిపై ఆదరణ పెరుగుతుంటే ఇక్కడివారు ఇటలీ మంత్రం జపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన శనివారంనాడు రంగారెడ్డి జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతీయతకు కొత్త అర్థాలు వెతకవద్దని ఆయన సూచించారు. ప్రపంచీకరణ వల్లఅందుబాటులోకి వచ్చిన అవకాశాలను యువత వాడుకోవాలని ఆయన అన్నారు.విద్యాసంస్థలు వ్యాపారమే పరమావధిగా కాకుండా సామాజికాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు.
ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్న ప్రస్తుత తరుణంలో నాణ్యతదెబ్బ తినకుండా చూడాలని ఆయన సూచించారు. కుహనామైనారిటీవాదం ప్రమాదకరంగా మారిందని, మైనారిటీలు కూడా భారత్లో భాగస్వాములేనని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఐఐటి స్థాపనకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.